
శివ గరుడ న్యూస్ ప్రతినిధి పార్వతీపురం
వసతిగృహ విద్యార్థుల ఆరోగ్యంపై పర్యవేక్షణ ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు సూచించారు. ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను 16 వార్డులో మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఉపాద్యాయ,వైద్య సిబ్బందితో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య సమాచారం తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది విద్యార్థులకు చేపట్టిన హెల్త్ స్క్రీనింగ్ వివరాల పై ఆరా తీశారు. విద్యార్థుల హీమోగ్లోబిన్ పరీక్షల నివేదికలను రికార్డులో తనిఖీ చేసి గత నెలల నివేదికలతో పోల్చి చూశారు. భవిత కార్డుల్లో నమోదు వివరాలు పరిశీలించారు. రక్త శాతం వృద్ధి చెందిన విద్యార్థులు,రక్త హీనత గా గుర్తించిన విద్యార్థుల వివరాలు పరిశీలించారు. స్వల్ప,మాధ్యమిక స్థాయిలో ఉన్న వారి హీమోగ్లోబిన్ శాతం సాధారణ స్థాయికి చేరేందుకు కార్యాచరణ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. నిర్దేశించిన విధంగా ఐరన్ ఫోలిక్ ఆసిడ్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలన్నారు. వసతి గృహ విద్యార్థుల్లో రక్తహీనత స్థితి ఉండకూడదన్నారు.వారి ఆరోగ్య విషయమై పర్యవేక్షణ ఉండాలన్నారు. హాస్టల్ లో సిక్ రూమ్, సిక్ రిజిస్టర్ పక్కగా నిర్వహించాలని విద్యార్థుల్లో ఏ చిన్న అనారోగ్య సమస్త గుర్తించినా తక్షణమే స్పందించాలన్నారు. పలు ఆరోగ్య సూచనలు చేశారు. ఆరోగ్యానికి పరిశుభ్రత ప్రధానమని తెలియ జేశారు. అనంతరం జిల్లా ఆసుపత్రిలో ఆయుష్మాన్ భారత్ టెలి మెడిసిన్ హబ్ సందర్శించి ఇ-సంజీవిని సేవలపై అక్కడ వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు.ప్రతీ రోజూ నమోదు అవుతున్న టెలి కాల్స్ వివరాలు పరిశీలించారు. ఆయన వెంట ఆరోగ్య శాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు తదితరులు ఉన్నారు.


