
జాతర, ఉత్సవాల్లో ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య శిబిరాలు దోహదపడతాయని ఆరోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు పేర్కొన్నారు. మహా శివరాత్రి మహోత్సవం సందర్భంగా కొమరాడ మండలంలో గుంప శ్రీ సోమేశ్వరస్వామి దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని బుధవారం ఆయన పర్యవేక్షించారు. శిబిరంలో మందులు,పరీక్షలు పరిశీలించి వైద్య శిబిరాన్ని వినియోగించుకున్న భక్తులు,ప్రజల ఆరోగ్య సమస్యలు,చికిత్సా వివరాలు వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.డీహైడ్రేషన్ కు గురికాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు,జీర్ణకోశ సంబంధిత సమస్యలు,గ్యాస్ట్రిక్ సమస్యలు,వాంతి,వికారం,కడుపునొప్పి,తలనొప్పి,జ్వరం,బిపి,మధుమేహం మొదలగు సమస్యలకు అవసరమైన మందులు శిబిరంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.అదే సమయంలో శిబిరంలో ఆరోగ్య సమస్యతో వచ్చిన భక్తులతో ఆయన మాట్లాడి వారి ఆరోగ్య సమస్య తెలుసుకొని వైద్య సిబ్బందిచే పరీక్షలు జరిపి మందులు అందజేశారు. అనంతరం అక్కడ ఉన్న మైకు ద్వారా భక్తులు,ప్రజలనుద్దేశించి డాక్టర్ జగన్మోహన్ ఆరోగ్య పరమైన జాగ్రత్తలు,సూచనలు తెలియజేసారు.భక్తులందరూ తమ వద్ద త్రాగు నీరు ఉంచాలని,పిల్లలకు అనవసరమైన తిను బండారాలు ఆ సమయంలో ఇవ్వొద్దని తద్వారా డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉందనీ కొద్దికొద్దిగా నీరు త్రాగిస్తూ ఉండాలని,అలాగే దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలున్న వారు అప్రమత్తంగా ఉండాలని ఎవరికి ఏ ఆరోగ్య సమస్య తలెత్తినా అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని వినియోగించు కోవాలని కోరారు. ఈ సందర్భంగా దేవస్థానం వద్ద సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన కాపారపు ఫౌండేషన్ వారు డాక్టర్ జగన్మోహన్ కు దుశ్శాలువతో సత్కరించి మొమోంటో అందజేశారు.అలాగే వైద్య సిబ్బందిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొమరాడ పిహెచ్సీ వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.
