

పార్వతీపురం నియోజకవర్గంలో రూ.లక్ష రూపాయలు కూడా విలువ చేయని స్థలాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి 40 లక్షలకు విక్రయించి గిరిజనులు, దళితుల కు లక్ష కూడా చెల్లించకుండా అక్రమాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర శుక్రవారం అసెంబ్లీలో ప్రసంగించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయం పై సమగ్రమైన దర్యాప్తు నిర్వహించి గిరిజనులు, దళితులకు న్యాయం చేయాలని మంత్రిని కోరారు. పార్వతిపురం నియోజకవర్గంలోని టిడ్కో గృహాల రంగులు మార్పిడి చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన మంత్రిని కోరారు. హరిజన, గిరిజనులు, దళితులు నివాసం ఉంటున్న స్థలాలపై ఇండ్లు నిర్మించుకునేందుకు ఎల్ పీ సీ ల సమస్య ఉందని, ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకొని అర్హులకు ఇల్లు నిర్మించుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. తెదేపా అధికారం కొనసాగించిన సమయంలో అమలు చేసిన ముఖ్యమంత్రి మోడల్ ఆరోగ్య కేంద్రాలను పునః ప్రారంభించాలని ఆయన కోరారు. పార్వతీపురంలో మలేరియా, టైఫాయిడ్, డయేరియా వ్యాధులు ప్రబలుతున్నాయని వీటివల్ల తక్కువ వయసులోనే గిరిజనులు మృత్యువాత పడుతున్నారని, వీటిని నిర్మూలనకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసి వారి ఆరోగ్యం కాపాడే బాధ్యత తీసుకోవాలి అన్నారు. మా సొంత గ్రామమైన నర్సిపురం లో ఎక్కువమంది సింగిల్ పేరెంట్ లు ఉన్నారని, వీరిలోఅవగాహన లేకపోవడం వల్ల చెడు అలవాట్ల వల్ల వ్యాధుల బారిన పడుతున్నారని, వీరిలో అవగాహన పెంచాలన్నారు. పార్వతీపురం పట్టణానికి ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ మంజూరు అయిందని, ఇది ఫేస్ త్రీ లో ఉందని, ఫేజ్ – 2 కి తీసుకువస్తే ఈ ప్రాంతీయులకు మేలు జరుగుతుందన్నారు. ఈ విషయంలో ఆరోగ్య శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.బలిజిపేట మండలం నారంనాయుడువలస పంచాయతీ పరిధిలోని శ్రీరంగరాజపురంలో ఎంతో మంది కిడ్నీ వ్యాధితో చనిపోతున్నారని వీరిని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. పాఠశాల స్థాయి నుంచి ఒలింపిక్ పోటీలకు వెళ్లేందుకు ప్రత్యేకంగా స్పోర్ట్స్ విభాగాన్ని ఏర్పాటు చేసి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించాలన్నారు. ఖేల్ ఇండియా లో స్పోర్ట్స్ స్టేడియం మంజూరు చేసినందుకు స్పోర్ట్స్ శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజక వర్గంలోని ప్రజా సమస్యలు కూలంకుశంగా తెలుసుకొని వాటి పరిస్కారం కోసం అసెంబ్లీలో తమ దృష్టికి తీసుకువచ్చిన ఎమ్మెల్యే విజయచంద్రకు ఆరోగ్యశాఖ మంత్రి సత్యప్రసాద్, క్రీడాల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అభిందించారు.
