

పార్వతీపురం నియోజకవర్గంలోని సీతానగరం వంతెన పనులు అసంపూర్తిగా ఉండడానికి గత వైసిపి ప్రభుత్వ పాలకుల ప్రభావమేనని బోనెల విజయచంద్ర అన్నారు. ఈ వంతెన మరమ్మత్తు పనులకు మంజూరైన నిధులను ఖర్చు చేయకుండా తన జేబులు నింపుకున్నారన్నారు. సీతానగరంలో నిర్మిస్తున్న వంతెన పనులను మూడు నెలల్లో పూర్తి చేయించి ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చి, వారి కళలను తీర్చుతామని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. ఆదివారం ఆయన సీతానగరం వంతెన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో నిర్మించిన వంతెన శిధిలావస్థకు చేరుకున్నప్పటికీ, ఇందుకు సంబంధించి నిధులు గత ప్రభుత్వం కోటి నాలుగు లక్షలు విడుదల చేసినప్పటికీ దీని ప్రాధాన్యతను విస్మరించారన్నారు.

గత ఎమ్మెల్యే ఈ వంతెన మరమ్మత్తులకు మంజూరైన నిధుల్లో 16 లక్షల మాత్రమే ఖర్చు పెట్టి మిగతా నిధులను జేబులోకి వేసుకొన్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సంక్షేమమే, అభివృద్దే ధ్యేయంగా కాంట్రాకర్లతో మాట్లాడి ఈ బ్రిడ్జి నిర్మాణం అవసరమైన నిధులను మంజూరు చేయించి, శరవేగంతో పనులు చేస్తున్నామన్నారు. సీతానగరం మండలంలోని గెడ్డలుప్పి వంతెనను కూడా త్వరలో పూర్తి చేయిస్తామన్నారు. అలాగే బూర్జ నుంచి చినఅంకలాం వంతెన కూడా ప్రతిపాదన చేసాం, ఆమోదమైందన్నారు. ఈ మూడు వంతెనలను పూర్తిచేసే బాధ్యతను తాను తీసుకుంటామన్నారు. దీంతోపాటుగా బలిజిపేట మండలంలోని నారాయణపురం వంతెనను కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

