
గరుడ న్యూస్ ప్రతినిధి, పార్వతీపురం
మహిళలు/చిన్నారుల రక్షణకు శక్తి టీంలు ఏర్పాటు. ….. జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్
ఐదుగురు సభ్యులతో మూడు బృందాలుగా 15మందితో శక్తి టీమ్స్ ఏర్పాటు చేసామన్న జిల్లా ఎస్పీ


జిల్లాలో మహిళలపై జరుగుతున్న దాడులు, ఆకతాయిల వేధింపులను నియంత్రించేందుకు, మహిళలకు/చిన్నారులకు రక్షణగా, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘శక్తి’ యాప్ పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యేకంగా జిల్లాలో శక్తి టీమ్స్ ను నియమించామని జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్ శుక్రవారం తెలిపారు. క్రొత్తగా ఏర్పాటు చేసిన శక్తి టీమ్స్ తో జిల్లా పోలీసు కార్యాలయంలో మమేకమై, వారు నిర్వర్తించే విధులు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశా నిర్ధేశం చేసారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ – మహిళలపట్ల ఎటువంటి దాడులు,అఘాయిత్యాలు, వేధింపులు లేకుండా చేసేందుకుగాను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ‘శక్తి టీమ్స్’ ను జిల్లాలో ఏర్పాటు చేసామన్నారు. ఈ శక్తి టీమ్స్ జిల్లాలోని కళాశాలలు, ముఖ్య కూడళ్ళును,రద్దీప్రదేసాలును మఫ్టీలో సందర్శించి, మహిళలను వేధించే ఆకతాయిలను గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు చేపడతారన్నారు. దీనిలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలో,పార్వతీపురం, పాలకొండ,సాలూరు లో ఐదుగురు పోలీసు సిబ్బంది చొప్పున 03 బృందాలుగా 15మందితో శక్తి టీమ్స్ ఏర్పాటు చేసామని, ఒక్కొక్క బృందానికి ఏఎస్ఐ నాయకత్వం వహిస్తారన్నారు. ఈ బృందాలు మఫ్టీలో విధులు నిర్వహిస్తారని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన శక్తి టీమ్స్ కొరకు ప్రత్యేకంగా కేటాయించిన
ఫోర్ వీలర్స్ను పెట్రోలింగ్ వాహనాలను వినియోగిస్తున్నామన్నారు. ఆపద/అత్యవసర సమయంలో శక్తి యాప్కు వచ్చే ఎస్.ఓ.ఎస్.కాల్స్, డయల్ 112/100 కాల్స్తో సంఘటన స్థలంకు వెళ్ళే వారు తమతోపాటు ట్యాబ్లను కూడా వెంట తీసుకొని వెళ్ళాలని, కాల్స్ వచ్చిన వెంటనే శక్తి బృందాలు అప్రమత్తమై సకాలంలో సంఘటనా స్ధలంకు చేరుకొని సమస్యలను చట్టబద్దంగా పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ శక్తి టీమ్స్ ను ఆదేశించారు. మహిళలకు రక్షణగా ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన శక్తి మొబైల్ యాప్ పట్ల ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పించి, వారి మొబైల్స్ లో యాప్ను నిక్షిప్తం చేయడం, రిజిస్ట్రేషను చేయాలన్నారు. ఆపద సమయాల్లో శక్తి యాప్ ఏవిధంగా పని చేస్తుందన్న విషయాన్ని మహిళలకు వివరించాలన్నారు. ఈ బృందాల పని తీరును జిల్లాలో మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సై గారు పర్యవేక్షిస్తారని, అంతేకాకుండా, శక్తి టీమ్ పని తీరును రాష్ట్ర డిజిపి కార్యాలయం కూడా పర్యవేక్షిస్తుందని, వారి ఆదేశాల మేరకు పనిచేయాల్సి ఉంటుందని జిల్లా ఎస్పీ శక్తి టీమ్స్ కు దిశా నిర్ధేశం చేసారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఏఎస్పీ అంకిత సురాన.ఐపిఎస్, ఏఆర్ డిఎస్పీ థామస్ రెడ్డి, ఆర్ఐ లు నాయుడు,రాంబాబు, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సై సురేష్ ,శక్తి టీమ్స్ సభ్యులు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
