ఆన్లైను బెట్టింగు యాప్లతో జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్ పిలుపునిచ్చారు. ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో ఆన్లైను, ఆఫ్లైను క్రికెట్ బెట్టింగులకు పాల్పడేవారు, ముఖ్యంగా యువత అప్రమత్తం ఉండాలని, ఆర్ధికంగా జీవితాలను నాశనం చేసే బెట్టింగు యాప్ల జోలికి పోవద్దని ప్రజలును, యువతను జిల్లా ఎస్పీ హెచ్చరించారు. క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో వీటిని అదునుగా చేసుకొని కొందరు స్వార్ధపరులు, చెడు నడత కలిగిన వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్ లకు తెరలేపే అవకాశం ఉందన్నారు. బెట్టింగ్ లకు బలి అవుతున్నవారిలో ఎక్కువ శాతం యువతే ఉంటున్నారన్నారు. సులభంగా అధిక నగదును అర్జించవచ్చునని యువతకు ఆశ చూపుతూ బెట్టింగ్ ఊబిలో దించుతారన్నారు. ఒక్కసారి బెట్టింగ్ లకు అలవాటు పడితే వాటి నుండి బయటకు రావడం కష్టతరం అవుతుందన్నారు. బెట్టింగ్ లో ఒకసారి ఆదాయం వచ్చినా పలుమార్లు నష్ట పోవడం జరుగుతుందన్నారు. ఆ నష్టాలను భర్తీ చేసుకోవడానికి, చేసిన అప్పులను తీర్చడానికి యువత దొంగతనాలకు, ఇతర నేరాలకు పాల్పడుతూ తమ భవిష్యత్తుని అంధకారం చేసుకుంటున్నారన్నారు. బెట్టింగ్ అనేది పెనుభూతం లాంటిదని, ఆశ చూపి అధ:పాతాళానికి నెట్టేస్తుందని యువత దానికి బలికాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. క్రికెట్ బెట్టింగ్ వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి, అంతేకాకుండా క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని అనేక మంది సూసైడ్ చేసుకుంటున్నారని,క్రికెట్ మ్యాచ్ లను వినోదం కోసం మాత్రమే చూడాలని, బెట్టింగులు వైపు మొగ్గు చూపకూడదన్నారు. యువత, విద్యార్థులు బెట్టింగ్ జోలికి వెళ్లకుండా చదువుపై, తమ ఉజ్వల భవిషత్తు పై దృష్టి సారించాలన్నారు. తమ తల్లిదండ్రుల ఆశయాల సాధన కోసం ఉన్నతంగా జీవించాలన్నారు. తల్లి దండ్రులు తమ పిల్లలను గమనిస్తూ ఉండాలన్నారు. బెట్టింగులకు పాల్పడుతుంట్లయితే వారికి నచ్చచెప్పి ఆ ఊబిలో నుండి బయటకు తీసుకురావాలన్నారు. గతంలో బెట్టింగ్ లకు పాలపడిన వారిపై, అనుమానితుల పై నిఘా ఉంచామన్నారు. . ఆన్ లైన్/ ఆఫ్లైను ద్వారా బెట్టింగ్ కు పాల్పడినా, గుంపులు గుంపులుగా కూర్చుని సెల్ చూస్తూ బెట్టింగ్స్ వేస్తున్న అలాంటి వారి పై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో ఎవరైనా బెట్టింగులను నిర్వహించినా, అమాయకులను, యువతను బెట్టింగ్ అను ఊబిలోకి లాగాలని ప్రయత్నించినా ఉపేక్షించబోమని, నిర్వాహుకులను గుర్తించి వారిపై ఆంధ్రప్రదేశ్ జూద చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడమే కాక కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అవసరం మేరకు suspect సీట్లు ఓపెన్ చేయడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ లు జరుగుతున్నట్లు తెలిస్తే డయల్ 112/100 కు (లేదా) సంబంధిత పోలీస్ అధికారులకు కాల్ చేసి సమాచారం అందించాలని, సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని జిల్లా ఎస్పీ తెలిపారు.