

16.90% జిల్లా వృద్ధిరేటుపై కలెక్టరుకు ప్రశంస
పిపిపి పర్సెప్షన్ లో జిల్లాకు 4వ ర్యాంకు పట్ల అభినందన
పార్వతీపురం మన్యం జిల్లాలో 16.90 శాతం వృద్ధి రేటు సాధించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ను ప్రశంశించారు. పార్వతీపురం మన్యం జిల్లా వృద్ధి రేటును అన్ని జిల్లాలు ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. పిపిపి పర్సెప్షన్ లో జిల్లా 4వ ర్యాంక్ లో ఉండటం పట్ల అభినందించారు. రెండు రోజుల జిల్లా కలెక్టర్ల సమావేశం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగింది. రెండవ రోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో జిల్లా కలెక్టర్ పాల్గొని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా జిల్లాలో చేపట్టిన, చేపడుతున్న ప్రగతిని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్బంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల సమస్య ఉందని, శాశ్వత పరిష్కారం చేపట్టవలసి ఉందని, కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కళాశాల 60 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు కావాల్సి ఉందన్నారు. అలాగే లాబేసు – పూర్ణపాడు వంతెన పనులు పూర్తి చేయాల్సి ఉందని, తద్వారా 19 గ్రామాలకు రహదారి సౌకర్యం లభిస్తుందని కలెక్టర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, తక్షణ చర్యలకు ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో 16.90 వృద్ది రేటు లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. జిల్లాలో 50 శాతం వ్యవసాయం రంగం నుంచి, 9 శాతం పారిశ్రామిక రంగం నుంచి, 42 శాతం సేవా రంగం నుంచి జిడిపి వస్తుందని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన పది సూత్రాలు ఖచ్చితంగా అమలు చేస్తూ మరింత వృద్ది సాధించుటకు చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు.
