

జిల్లాల్లో పశువుల నీటి తొట్టెల నిర్మాణాలు మంగళవారం ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశు సంవర్ధక శాఖ ప్రతిపాదనల మేరకు జిల్లాలో 411 పశువుల తొట్టెలు మంజూరు చేయడం జరిగిందన్నారు. పంచాయతీ రాజ్ సంచాలకులు తక్షణం నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని ఆయన ఆదేశించారు. పశు తాగు నీటి తొట్టెలు వేసవి దృష్ట్యా చాలా అవసరమని ఆయన చెప్పారు. పశువులకు తాగు నీరు అందుటకు ఏర్పాటు చేస్తున్న తొట్టెలు నిర్మాణంలో నాణ్యతలో రాజీ పడరాదని ఆయన స్పష్టం చేశారు.
తాగు నీటి సమస్యలపై తక్షణం స్పందించాలి
మండలాల్లో తాగు నీటి సమస్యలపై వస్తున్న అంశాలు పట్ల తక్షణం స్పందించాలని జిల్లా కలెక్టర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారులను ఆదేశించారు. ఎక్కడ తాగు నీటి ఎద్దడి తలెత్తరాదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, వచ్చే మూడు నెలల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. మండలాల్లో తాగు నీటి సంబంధిత పిర్యాదులకు ప్రత్యేక సెల్ నిర్వహించి పిర్యాదులు ఫోన్ ద్వారా గాని, స్వయంగా గాని స్వీకరించి 24 గంటల్లో పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ఇందుకు ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలని ఆయన అన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
