
తిరుపతి జిల్లా, పాకాల మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): కమనీయం.. శ్రీ సీతారాముల కల్యాణం.. తుమ్మలగుంటలో వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు.
పట్టువస్త్రాలు సమర్పించిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి దంపతులు. కల్యాణమహోత్సవంలో పాల్గొన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డివానికి చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి సన్నిద్ధిలో ఆదివారం శ్రీరామ నవమి వేడుకలు అంగరంగవైభవంగా సాగాయి. ముందుగా స్వామి వారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి దైనందిన పూజా కైంకర్యాలను జరిపించారు. అనంతరం గర్భాలయంలోని శ్రీసీతారామ సమేత లక్ష్మణ ఆంజినేయస్వాముల ఉత్సవ మూర్తులను బయటకు తీసుకువచ్చి అభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రధాన ఆలయం ముందు ఏర్పాటు చేసిన వివాహ మండపానికి ఉత్సవమూర్తులను తీసుకువచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠలపై కొలువు దీర్చారు. అనంతరం విశ్వక్సేనారాధన, గణపతి పూజలతో కల్యాణోత్సవ ఘట్టాన్ని ప్రారంభించారు. అనంతరం రక్షాబంధనాలను శ్రీరామ, సీతాదేవిల ఉత్సవమూర్తుల ముంజేతులకు ధరింపచేసిన అర్చకస్వాములు శాస్త్రోక్తంగా వివాహ తంతును జరిపించారు. వేదపండితుల మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల శ్రీరామ నామ స్మరణల మద్యన శ్రీసీతారాముల కల్యాణం కన్నులపండువుగా సాగింది. ముందుగా నిర్ణయించిన శుభ ముహూర్తానికి రామయ్య చేయి తాకించిన మంగళ సూత్రాన్ని సీతమ్మ మెడలో అలంకరింప చేశారు. అనంతరం ముత్యాల తలంబ్రాలను రామయ్య, సీతమ్మల తలపై పోసిన అర్చకస్వాములు పూలమాలలు చేతబట్టుకుని ఆడుతూ ఆనందంగా కల్యాణ ఘట్టాన్ని జరిపించారు. అంతకు ముందు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, ఆలయ వ్యవస్థాపకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించగా తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కల్యాణోత్సవంలో పాలుపంచుకున్నారు. భక్తులు అందరికీ తలంబ్రాలు పంపిణీ. శ్రీ సీతారాముల కల్యాణం చూడటానికి వచ్చిన భక్తులు అందరికీ అర్చకస్వాములు తలంబ్రాలను అందజేయడంతో భక్తులు పోటీపడ్డారు. అయితే తొక్కిసలాట జరగకుండా భక్తులు కూర్చున్న చోటుకే అర్చకస్వాములు తలంబ్రాలను తీసుకువెళ్లి ఇవ్వడంతో ఎక్కడా ఇబ్బందులు తలెత్తలేదు. ప్రతి ఏటా నిర్వహించే శ్రీరామ నవమి ఉత్సవాల తరహాలోనే ఈ ఏడాది కూడా ఉత్సవాలను నిర్వహించడంతో చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీసీతారాముల కల్యాణాన్ని కనులారా వీక్షించి రామనామ స్మరణలతో తమ మొక్కులు తీర్చుకున్నారు. కల్యాణ వేదికపై వేద పండితులు శస్త్రోక్తంగా జరిపిస్తున్న వివాహతంతును వీక్షించిన భక్తులు స్వామి, అమ్మవార్ల ఆశీస్సులు స్వీకరించారు. కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులు అందరికీ ఆలయం వద్ద వడపప్పు, పానకంను ప్రసాదంగా అందజేశారు.
రమణీయంగా శ్రీరామ పట్టాభిషేకం
శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం కల్యాణ మహోత్సవాన్ని జరిపంచిన అర్చకస్వాములు సాయంత్ర శ్రీరామ పట్టాభిషేకంను శస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీసీతారామ కల్యాణం ముగిసిన తరువాత అయోధ్యకు శ్రీరామచంద్రుడు రాజుగా పరిపాలన సాగించడానికి దశరథమహారాజు ముక్కోటి దేవతల సాక్షిగా పట్టాభిషేకం చేసే ఘట్టాన్ని అర్చక స్వాములు చూడముచ్చటగా నిర్వహించారు. భక్తుల జయ జయ ధ్వానాల మద్యన శ్రీరాముని పట్టాభిషేకం రమణీయంగా సాగింది.


