తిరుపతి జిల్లా, పాకాల మండలం గరుడ న్యూస్ (ప్రతినిథి): S. రాజేష్; వైఎస్ జగన్ ను కలిసిన తిరుపతి రూరల్ ఎంపీటీసీలు-ఇటీవల జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో విజయంపై అభినందనలు.. మోహిత్ రెడ్డికి వెన్నుదన్నుగా నిలబడాలని సూచించిన జగన్వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరుపతి రూరల్ మండలంకు చెందిన ఎంపీటీసీలు, సర్పంచ్ లతో పాటు పలువురు పార్టీ ముఖ్య నాయకులు గురువారం కలిశారు. ఇటీవల జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి నిజాయతీగా నిలబడి మద్దతు తెలిపిన ప్రతి ఒక్క ఎంపీటీసీని జగన్ అభినందించారు. అంతకు ముందు ఎంపీటీసీలను స్థానిక కూటమి పార్టీల నేతలు ఎలా ప్రలోభపెట్టారు అన్న విషయాలను చెవిరెడ్డి మోహిత్ రెడ్డి జగనన్నకు వివరించారు. అనంతరం జగన్ ప్రతి ఒక్క ఎంపీటీసీ త్యాగాన్ని గుర్తు చేసుకుని అధికార పార్టీ నేతలు ఎన్నిరకాలుగా ప్రలోభాలకు గురిచేసినా పార్టీ కోసం గట్టిగా నిలబడి పార్టీ అభ్యర్థికి మద్దతు తెలపడం శుభ పరిణామన్నారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నాయకత్వంలో చంద్రగిరిని మళ్లీ వైఎస్ఆర్ సీపీ ఖాతాలోకి తీసుకురావాలని, అప్పటి వరకు వీరోచితంగా పోరాడాలన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి గ్రామ స్థాయిలో ప్రజలకు తెలియపరచాలన్నారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడుగా మీ అందరికీ సుపరిచితుడుగా కష్టపడటానికి సిద్ధంగా వున్నాడని, అతనికి అండగా నిలబడాలన్నారు. అనంతరం పలువురు ఎంపీటీసీలు జగనన్న వద్దకు వెళ్లి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తమకు అన్ని విధాలుగా అండగా నిలబడ్డాడని, ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటారని ఆయన నాయకత్వంలో పార్టీ బలోపేతానికి పనిచేస్తామన్నారు. అనంతరం సర్పంచ్ లు, పార్టీ నేతలతో కూడా జగన్ ఆత్మీయంగా మాట్లాడుతూ చెవిరెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న మీరంతా పోరాటయోధులన్న విషయం తమకు తెలుసునని చెబుతూ అందరినీ అభినందించారు. చివరగా తిరుపతి రూరల్ ఎంపీపీగా గెలిచిన మూలం చంద్రమోహన్ రెడ్డిని అభినందించారు.