


*వేసవి సెలవుల ప్రభావం*
*తెలుగు రాష్ట్రాల భక్తుల దర్శనం*
*అంతా వెంకటేశ్వర స్వామి మహత్యం*
*ఏడు శని వారాల వెంకన్న దర్శనం.. ఏడేడు జన్మల పుణ్యఫలం* నినాదంతో కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. వందల సంఖ్యలో ప్రారంభమైన ఏడు శనివారాలు భక్తులు ఇప్పుడు వేల సంఖ్యలోకి చేరిపోయారు. తెలుగు రాష్ట్రాల నుంచి రైళ్లు, ఆర్టీసీ ప్రైవేటు బస్సులు, కార్లు,ఆటోలు,వ్యాన్లు, మోటార్ సైకిళ్ళు పై వేలాదిగా భక్తులు తరలివొస్తున్నారు. వీరే గాక స్థానికంగా నలభై ఏభై కిలోమీటర్ల నుంచి కూడా కాలినడకన స్వామివారి ఆలయానికి వచ్చి మొక్కలు తీర్చుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలకు వేసవి సెలవు ప్రకటించడంతో ఈ భక్తుల సంఖ్య మరింత పెరిగింది. గోదావరి ప్రవాహంలా వెంకన్న ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు.
గౌతమి గోదావరికి పశ్చిమ వైపున పచ్చని పంట పొలాల మధ్య ఈ స్వామి వారి ఆలయం కొలువుదీరి ఉంటుంది. కేరళ తరహాలో కోనసీమ అందాలు ఉంటాయి. ఆ కోనసీమ అందాలు చూడడానికి రెండు కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు.అటువంటి అందాలరాశులు ఉండే ప్రాంతాలలో ఆత్రేయపురం మండలం ఒకటి. ఆకాశానికి ఎగిసిపడే కొబ్బరి చెట్లు.. పచ్చని తివాచీ పరిచినట్లుగా ఉండే వరి పొలాలు.. గలగల పారే పంట కాలువలు. ఈ ఆహ్లాదకరమైన అందాలను తిలకించడానికి దూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు తరలి వస్తుంటారు.అయితే అలాంటి పర్యాటక ప్రాంతంలో ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండడం విశేషం.
దేవాలయాలకు పర్యాటక రంగం తోడైతే ఇక ఆ క్షేత్రాలకు తిరిగే ఉండదు. ఎన్నిసార్లు వెళ్లినా మళ్లీ మళ్లీ వెళ్లాలనిపించే ప్రాంతాలవుతాయి. ఇప్పుడు వాడపల్లి దేవాలయం పరిస్థితి కూడా అదే.వారానికి ఒక రూపంలో ఈ వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తుంటారు.స్వామి వారి పూల,పండ్ల అలంకరణ ఈ ఆలయానికి ప్రత్యేకత. అందువల్లే ఈ స్వామివారిని ఎన్ని సార్లు చూసిన మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది.దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఆ స్వామి వారిని తనివితీరా చూసి భక్తితో పరవశించిపోతారు. అప్పటి వరకు ఎంతో కష్టపడి ఇక్కడకి చేరుకున్న వారంతా ఎక్కడా దొరకని ఆనందంతో ఏదో తెలియని అనుభూతిని పొందగలుగుతున్నారు. అందుకని ఎంత వ్యయప్రయాసలు పడినా ఇక్కడికి రాగలుగుతున్నారు..కాదుకాదు స్వామి వారు రప్పించుకోగలుగుతున్నారు.
ఈ స్వామివారి అలంకరణే కాదు ఆలయ రూపు రేఖలు కూడా వారం మారు వారం మారిపోతున్నాయంటే అతిశయోక్తి కాదు. నెలా రెండు నెలల తర్వాత ఎవరైనా ఈ ఆలయానికి వెళితే ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. అంటే అంతగా ఆలయ అభివృద్ధి సాధిస్తుంది.గత దశాబ్దన్నర కాలంగా ఈ ఆలయానికి ఎక్కడలేని మహర్దశ కనిపిస్తుంది. భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగు పోతుండండంతో అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించవలసి వస్తుంది.టిక్కెట్లు ధరలు పెంచినప్పటికీ ఏమాత్రం వెనకాడకుండా స్వామివారి దర్శనానికి భక్తులు పోటీపడుతున్నారు.ఈ శనివారం సాయంత్రం నాలుగు గంటలకు రూ. 1,116 వేదార్విచనం టిక్కెట్లు ద్వారా రూ.15,51,240 ఆదాయం రావడం ఇందుకు నిదర్శనంగా పేర్కోవచ్చు.అలాగే రూ 200 విశిష్ట దర్శనం టిక్కెట్లు ద్వారా రూ.12,73,200 రాగా రూ 50 లు ప్రత్యేక దర్శనం ద్వారా రూ.7,74,450 లు వచ్చాయి. హుండీ కాకుండా టిక్కెట్లు, ఆన్ లైన్ విరాళాలుగా సాయంత్రానికి రూ.49,60,411 ఆదాయం సమకూరింది.దీన్ని బట్టి ఆలయంకు వచ్చే భక్తులు తాకిడి ఎలా ఉంటుందో స్పష్టమవుతుంది.
శనివారం వస్తుందంటే చాలు వాడపల్లి పరిసర ప్రాంతాలన్నీ తిరునాళ్ళను తలదన్నేలా కనువిందు చేస్తున్నాయి. కోనసీమ ముఖ ద్వారం రావులపాలెం మొదలుకొని వాడపల్లి.. ఆత్రేయపురం ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్కడలేని ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటున్నాయి. గోవింద నామ స్మరణలతో మార్మోగిపోతున్నాయి. ఆలయం చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణం కూడా ఇక్కడ ఓ ప్రత్యేకత. భక్తులు రాకపోకలు వల్ల ప్రదక్షణకు ఆటంకం కలుగుతుందని ఫ్లై ఓవర్ ను కూడా నిర్మించారు. అలాగే వేసవిని దృష్టిలో ఉంచుకుని కూలర్లు,ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. వీటితోపాటు ఎక్కడికక్కడ కూలింగ్ వాటర్ ను భక్తులకు అందిస్తున్నారు. ఇందుకోసం ఆలయ ఉద్యోగులతో పాటు అనేక మంది మహిళలు సేవ చేయడానికి విచ్చేస్తున్నారు.ఇక్కడ భక్తులకు అందించే అన్నదానం కూడా విశేష ఆదరణ పొందింది.
కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రభుత్వం నుంచి నిధులు సమకూరుస్తున్నారు. అలాగే ఈ ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనకు కూడా ఆయన ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ ముదునూరి వెంకట్రాజు, ఈవో నల్లం సూర్య చక్రధర్ లు ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి శనివారం ఇక్కడికి వచ్చే వాహనాలు వల్ల ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కొత్తపేట డిఎస్పి సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో రావులపాలెం రూరల్ సీఐ సిహెచ్ విద్యాసాగర్ గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
