
గ్రామీణ రహదారులకు మహార్ధశ

రెండు కిలోమీటర్లు దూరం కాలువ గట్టుపై నడిచి రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర
బలిజిపేట మండలంలోని గౌరీపురం గ్రామం నుంచి చాకరాపల్లి వరకు ఉన్న రెండున్నర కిలోమీటర్ల రహదారి పనులకు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర రూ.రెండు కోట్ల 90 లక్షల నిధులను మంజూరు చేయించారు. ఈ రెండు గ్రామాల మధ్య ఉన్న కాలువ గట్టుపై రెండు కిలోమీటర్ల దూరంలో ఆయన కాలినడకన వెళ్లి అక్కడి రైతులతో మాట్లాడి రోడ్డు వేసేందుకు రైతులు సహకరించాలని కోరారు. ఐదు దశాబ్దలుగా ఇక్కడి ఇరుకైన కాలువ గట్టుపై రైతులు వారు పండించిన పంటలను గమ్యాన్ని చేర్చేందుకు నానా అవస్థలు పడుతున్నారు. అలాగే వీరు పంట పొలాలకు ఎరువులు, విత్తనాలు తీసుకొచ్చిందుకు కూడా అవస్థలు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర రైతుల కష్టాలను తీర్చేందుకు రోడ్డు పనులకు నిధులు మంజూరు చేసి రైతులకు అండగా నిలిచారు. ఈ పనులను నెలరోజుల్లోగా పూర్తి చేయించి రైతులకు రహదారి కష్టాలు తీర్చాలని ఆయన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు పెద పాపినాయుడు, గొట్టాపు వెంకటనాయుడు, రాజశేఖర్, రాంబాబు, బాబ్జి, తహసీల్దార్ రత్న కుమారి, పంచాయతీ శాఖ డీఈఈ ఏఈ, రైతులు పాల్గొన్నారు.

