
తిరుపతి జిల్లా, రామచంద్రపురం మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): విద్యార్థులు ఎన్.సి.సి శిక్షణ పొందడం వల్ల, విద్య, ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్ పొందడంతో పాటు బహుళ ప్రయోజనాలను పొందవచ్చని ఎన్.సి.సి గ్రూప్ కమాండర్ కల్నల్ సతీందర్ దహియ అన్నారు. బుధవారం మండలంలోని సి రామాపురం గ్రామంలోని వెరిటాస్ సైనిక స్కూల్ ఆవరణంలో 11 ఎయిర్ స్క్వాడ్రన్ (టెక్నికల్) ఎన్సీసీ తిరుపతి గ్రూప్ ప్రధాన కార్యాలయాల ఆధ్వర్యంలో కంబైన్డ్ వార్షిక శిక్షణ శిబిరాలను నిర్వహించారు. గ్రూప్ కమాండర్ కల్నల్ సతీందర్ దహియ, ట్రైనింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ సందీప్ శంకర్ లు వారు ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్ సి సి క్యాడెట్లను ఉద్దేశించి గ్రూప్ కమాండర్ కల్నల్ సతీందర్ దహియ మాట్లాడుతూ ఎన్సిసి శిక్షణ తో సి సర్టిఫికెట్ పొందితే దేశ రక్షణ విభాగాలైన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ నందు ఉద్యోగాలను సులభతరంగా పొందవచ్చు అన్నారు. ట్రైనింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ సందీప్ శంకర్ మాట్లాడుతూ ఎన్సిసి శిక్షణ పొందడం వల్ల క్యాడెట్లు యూనిటీ, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలన్నారు. క్యాంప్ కమాండర్ కెప్టెన్ రాజగోపాల్ జగదీష్ ఆత్రే మాట్లాడుతూ విద్యార్థులకు శిక్షణ శిబిరంలో నైతిక విలువలతో కూడిన శిక్షణను అందజేస్తున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థినీ, విద్యార్థులు ఎన్. సి. సి శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకుని ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలన్నారు. అనంతరం ఆర్మీ, ఎయిర్ వింగ్ విభాగాలలో క్యాడెట్లకు ఇస్తున్న శిక్షణను వారు ప్రత్యేకంగా పరిశీలించారు. విద్యార్థులకు శిక్షణ శిబిరంలో భోజన వసతులు, శిక్షణలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. వెరిటాస్ సైనిక పాఠశాల ఆవరణంలో ఎన్సిసి శిక్షణా తరగతులు అద్భుతంగా నిర్వహిస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేసి సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ క్యాం కమాండర్ శ్రీనివాసులు, క్యాంపు పర్యవేక్షకులు కే గుణశేఖర్, సీనియర్ ఏఎన్ఓలు ఉదయ్, రాజశేఖర్, ఎన్ సి సి క్యాడెట్లు, సిబ్బంది పాల్గొన్నారు.


విద్యార్థుల ఉద్దేశించి ప్రసంగిస్తున్న గ్రూప్ కమాండర్ సతిందర్దహియ.

సమావేశానికి హాజరైన ఎన్సిసి క్యాడెట్లు.
