
గరుడ న్యూస్



యోగా ద్వారా భారత దేశ ప్రతిష్ట విశ్వ వ్యాప్తం
-యోగాంధ్ర కార్యక్రమం లో ప్రజలు పాల్గొని విజయవంతం చేయండి
-జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి
-యోగా తో శారీరక, మానసిక ధృడత్వం పెరుగుతుంది
-జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు యోగా కార్యక్రమాల నిర్వహణ
-ఆరోగ్యాన్ని విస్మరిస్తున్న ప్రజలు
-ఎండలో యోగా అభ్యాసానలు చేయడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందు
భారత ప్రధాని నరేంద్ర మోడి ఆదేశాలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు రాష్ట్రం లో మే 21 నుండి జూన్ 21 వరకు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నదని, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాం ప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం చౌడేపల్లి మండలం బోయకొండ దేవస్థానం వద్ద యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగా అభ్యసన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పి మణికంఠ చందోలుతో కలసి జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పాల్గొన్నారు. యోగాంధ్ర కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభం కాగా యోగా గురువు బాబు యోగా విశిష్టతను వివరిస్తూ వివిధ ఆసనాలను వేసే పద్ధతిని నేర్పుతూ ఆ ఆసనాల ప్రాముఖ్యతను సవివరంగా తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ మంత్రి మాట్లాడుతూ భారతీయ శాస్త్ర సంపద ప్రపంచానికి దిక్సూచిగా యోగా ను అందించారన్నారు. భారత దేశం అందించిన యోగా నేడు విశ్వవ్యాపితం అయిందన్నారు. మే 21 ప్రారంభించిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నదన్నారు. భారత ప్రధాని పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం చేపట్టిందని, ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా జూన్ 21న విశాఖపట్నంలో ఆర్ కె బీచ్ నుండి భీమునిపట్నం వరకు 5 లక్షలతో యోగాంధ్ర కార్యక్రమం చేపట్టి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారని తెలిపారు. అదే రోజు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు 2 కోట్ల మంది కార్యక్రమంలో పాల్గొనేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా కార్యక్రమంలో పాల్గొని యోగా అభ్యసన పై అవగాహన పెంచుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మే 21 నుండి ఒక నెల రోజుల పాటు జిల్లాలో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు యోగా అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. యోగా చేయడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఒత్తిడిని జయించ గలుగు తారన్నారు. మానసిక ఒత్తిడి తగ్గితే ప్రజలు తమ దైనందిన జీవితాన్ని ఆరోగ్యంగా ఉత్సాహంగా గడపవచ్చన్నారు. క్రమంగా యోగా చేస్తే బిపి, షుగర్ లాంటి వ్యాధులను కూడా అదుపులో ఉంచుకోవచ్చారు. జిల్లాలో 5 వేల మంది మాస్టర్ ట్రైనర్ లను ఏర్పాటు చేసి యోగా అవగాహన కార్యక్రమం చేపట్టామని, గ్రామ స్థాయిలో ప్రతి సచివాలయ పరిధిలో కనీసం 7 కార్యక్రమాలు చేపట్టేలా కార్యాచరణ రూపొందించామన్నారు. యోగాంధ్ర కార్యక్రమ నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల నుండి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తున్నారని, వీటిని అనుసరించి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతున్నామన్నారు. జిల్లా ఎస్ పి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడి పూర్వం నుండి ఉన్నదని, కానీ ప్రజలు ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారన్నారు. ప్రతి రోజు కనీసం అర్థ గంట వ్యాయామం చేయడం ద్వారా చాలా రకాల జబ్బులు దరిచేరవన్నారు. యోగాంధ్ర కార్యక్రమం ద్వారా అర్థ గంట పాటు చేసిన అభ్యసనను ప్రజలందరూ ప్రతి రోజూ క్రమం తప్పకుండా చేసినట్లయితే చాలా ఆరోగ్యంగా ఉంటారన్నారు. యోగా చేసినట్లయితే రోగనిరోధక శక్తి పెరుగుతుందని, దీనితో పలు రకాల జబ్బుల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చన్నారు. ఎండలో వ్యాయాయం చేస్తే శరీరానికి విటమిన్ డి లభిస్తుందని, ప్రజల ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యోగాంధ్ర కార్యక్రమాలను తీసుకొచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యటక శాఖ అధికారి గౌరీ,డి ఆర్ డి ఎ పిడి శ్రీదేవి,డిఎస్డిఓ బాలాజీ, పలమనేరు ఆర్డిఓ భవాని, బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈఓ ఏకాంబరం, చౌడేపల్లి తహసిల్దార్ హనుమంతు , ఎంపీడిఓ లీలా మాధవి ప్రజా ప్రతినిధులు,మహిళలు, విద్యార్థులు,పాల్గొన్నారు.