గరుడ న్యూస్,పాచిపెంట
రైతులకు సాగు ఖర్చులు తగ్గించి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ అధిక దిగుబడులు సాధించేందుకు పొలం పిలుస్తోంది కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతి రావు అన్నారు. చిట్టెలబ గ్రామంలో ఏర్పాటు చేసిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి మంగళ బుధవారాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించబడుతుందని రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోడు వ్యవసాయంలో గిరిజన రైతులు ఎక్కువగా చిరుధాన్యాలు పండిస్తున్నారని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా చిరుధాన్యాలకు మంచి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందని చోడి పంటకు కేజీ 49 రూపాయలకు పైగా మద్దతు ధర ఉందని కాబట్టి చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని కోరారు. చిరుధాన్యాలను, వరి వంటి విత్తనాలను 90% రాయితీపై గిరిజనులకు అందిస్తున్నామని ప్రభుత్వం ఇచ్చే ఈ రాయితీలను సద్వినియోగం చేసుకొని పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా నూతన సాంకేతిక సాగులో మెలకువలను తెలుసుకుని సాగు విస్తీర్ణంతో పాటు దిగుబడిని కూడా పెంచాలని కోరారు గ్రామంలో నలుగురు రైతులు అన్నదాత సుఖీభవ ఈ కేవైసీ చేయించుకోలేదని వారు ఈ కేవైసీ పూర్తి చేసుకుంటే అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులు అవుతారని తెలిపారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా ప్రకృతి సేద్య ఉత్పత్తులకు అధిక ధరలు కల్పించాలని అలాగే ప్రకృతి సేద్యానికి కావలసిన ముడి సరుకులను కూడా రాయితీపై అందిస్తే పోడు వ్యవసాయపు దిగుబడులు పెంచుకోగలుగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు కిరణ్ కుమార్ ప్రకృతి సేద్య క్లస్టర్ ఇంచార్జ్ సురేష్ కుమార్ అప్పన్న, రైతులు పాల్గొన్నారు.