

తిరుపతి జిల్లా, పాకాల మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): మహాభారతం.. కేవలం ఒక గ్రంథం మాత్రమే కాదు ఇది మన జీవితాలకు దిక్సూచి లాంటిది. ఒక మనిషి మనిషిగా బ్రతకాలి అంటే తప్పనిసరిగా భారతాన్ని తెలుసుకోవాలి. వింటే భారతమే వినాలి. తింటే గారెలే తినాలి అనేది మన పెద్దలు సరదాగా చెప్పే సామెతలుగా మనకు తెలుసు. కానీ వారి మాటల్లో చాలా అర్థాలు గూడార్థాలు దాగి ఉన్నాయి. తెలుసుకుంటే ఇది ఒక అద్భుతం. ఈనాడు సమాజంలో స్త్రీ పట్ల జరుగుతున్న దాడులు, అవమానాలు, అన్నదమ్ముల మధ్య తగాదాలు, ఆస్తుల గొడవలు, కుటుంబంలో ఆదిపత్య ధోరణి కేవలం కలియుగం అంటే నేటి కాలంలో కొత్తగా పుట్టుకొచ్చినవి కావు అనేది ముమ్మాటికి నిజం. నాడు శ్రీకృష్ణ భగవానుడు ఉన్న ద్వాపర యుగంలోనే ఇవన్నీ ఉన్నాయి అనేదానికి నిదర్శనం (మహాభారతం) భగవద్గీత గ్రంథంలో లిఖించబడ్డ అక్షరాలు. భగవద్గీత చదివి తెలుసుకున్నది కొందరైతే, ఆ భగవద్గీతనే హరికథ రూపంలో మనకు వివరించి అందరికీ అర్థమయ్యేలా వర్ణించి చెప్పే హరిదాసులు కొందరైతే, అదే భగవద్గీతను నాటకం రూపంలోనూ మనకు అర్థమయ్యే విధంగా కళ్లకు కట్టినట్లుగా చూపించే కళాకారులు మరికొందరు… ఏదో ఒక రూపంలో మనందరికీ మహాభారతం అనే ఈ కథనాన్ని, మన చరిత్రను మనకు పరిచయం చేసే గొప్ప ప్రయత్నమే మహా భారత మహా యజ్ఞం మన దామలచెరువులో.. ధర్మరాజు సమేత శ్రీ ద్రౌపతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజు హరికథా శ్రవణం మరియు మహాభారతం నాటక రూపంలోనూ ప్రదర్శించబడతాయి. 19వ తేదీ గురువారం నాడు శ్రీకృష్ణ లీలలు హరికథ కాలక్షేపం శ్రీమతి ఉషారాణి భాగవతరణి గారిచే నిర్వహించబడును. ప్రతి ఒక్కరూ భక్తితో ఈ యొక్క కార్యక్రమాల్లో పాలుపంచుకొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు మరియు పెద్దలు ప్రతి ఒక్కరిని పేరుపేరునా ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
