
గరుడ న్యూస్,సాలూరు
25 కిలోల 32 రకాల నవధాన్య విత్తనాలను ఒక ఎకరానికి వేసి 40 రోజుల తర్వాత కలియదున్ని అనంతరం మొక్కజొన్న వరి మరియు పొగాకు పంటలను వేస్తే నవధాన్యాల భూసార ఫలితం ఆయా పంటలపై ఎలా ఉంటుందో తెలుసుకునే సరికొత్త ప్రయోగాన్ని పాంచాలి గ్రామంలో రైతు సేనాపతి భాస్కరరావు పొలంలో చేయడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు మాట్లాడుతూ నవధాన్యాలు భూసారాన్ని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయని, వరుసగా మూడు సీజన్ల పాటు నవధాన్యాలను సాగు చేసి కలియ దున్నిన అనంతరం మొదటి సంవత్సరంతో పోలిస్తే మూడవ సంవత్సరం భూమిలో సేంద్రియ కర్బనం శాతం ఎంత పెరిగింది ప్రతి సంవత్సరం దిగుబడులు ఎంత పెరిగాయి రసాయన ఎరువులపై భారం ఎంతవరకు తగ్గుతుంది పంట చీడ పీడ లను తట్టుకునే స్వభావం ఎంతవరకు మెరుగుపడుతుంది సాగు ఖర్చులు తగ్గి పంట నాణ్యత ఎంతవరకు పెరుగుతుంది అనే విషయాలపై అధ్యయనం చేస్తామని రైతులకు క్షేత్రస్థాయిలో క్షేత్ర దినోత్సవాలను పెట్టి ఫలితాలను వివరిస్తామని తెలిపారు రాబోయే రోజులలో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు శ్రీను, ప్రకృతి సేద్య క్లస్టర్ ఎల్ వన్ తిరుపతి నాయుడు పాల్గొన్నారు.

