
పార్వతీపురం పురపాలక సంఘం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే విజయ్ చంద్ర తెలిపారు. శుక్రవారం జరిగిన పురపాలక సంఘ బడ్జెట్, అత్యవసర సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, పట్టణంలోని 30 వార్డుల పరిధిలో 100 అభివృద్ధి పనులకు అనుమతి లభించిందని, అన్ని పనులను ఒకేరోజు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.కులాల పేర్లతో ఉన్న వీధుల పేర్లను మార్చి, ప్రముఖుల పేర్లతో నూతనంగా నామకరణం చేసినట్లు తెలిపారు. సమగ్ర రక్షిత నీటి పథకానికి నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని అన్నారు. పురపాలక సంఘాన్ని కార్పొరేషన్గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దానికి అనుగుణంగా కార్యాలయాన్ని ఆధునీకరిస్తామని తెలిపారు. పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చే దిశగా కౌన్సిల్ సమావేశంలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నిషేధించి, గాజు సీసాల్లో నీటిని అందించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.




