


కొద్దిపాటి వర్షానికి చెరువును తలపిస్తున్న పార్వతీపురం పట్టణ మెయిన్ రోడ్డు
మెయిన్ రోడ్డు ముంపును అరికట్టడంలో విఫలమైన వైసీపీ, కూటమి పాలకులు
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసినా పరిష్కారం శూన్యం
పార్వతీపురం పట్టణ మెయిన్ రోడ్డులో ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
వానొస్తే పార్వతీపురం పట్టణ మెయిన్ రోడ్డులో పడవలు వేయాల్సిందేనని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎద్దేవా చేశారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఓబిసి పార్వతీపురం మన్యం జిల్లా చైర్మన్ వంగల దాలి నాయుడు, నియోజకవర్గ చైర్మన్ సిరిసుపల్లి సాయి శ్రీనివాస్ తదితరులు ముంపుకు గురైన పార్వతీపురం పట్టణ మెయిన్ రోడ్డు ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కురిసిన కొద్దిపాటి వర్షానికి పార్వతీపురం పట్టణ మెయిన్ రోడ్డు చెరువును తలపించేలా నీట మునిగిందన్నారు. సారికి వీధి జంక్షన్ నుండి దేవాంగుల వీధి వరకు, ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ తదితర ప్రాంతాలు ఏమాత్రం వర్షం పడినా మోకాలు లోతు నీటితో నిండి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. వైసీపీ పాలనలో మెయిన్ రోడ్డు నీట మునుగుతోందంటూ… నీటిలో తిరుగుతూ ఆరోపణలు చేసిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చాక చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. గత నెలలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వర్షాకాలం వస్తే మెయిన్ రోడ్డు ముంపుకు గురవుతోందని, సౌందర్య రోడ్డుతో పాటు ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ నీట మునుగుతోందని దానిపై తగు చర్యలు చేపట్టాలని కోరడం జరిగిందన్నారు. అయినా అధికారుల్లో చలనం లేదన్నారు. ఇక వైసిపి, కూటమి పాలకులు మున్సిపాలిటీలో ముంపు ప్రాంతాలు ముంపకు గురికాకుండా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు. పార్వతీపురం పట్టణ మెయిన్ రోడ్డులో మొరుగు కాలువల్లో మురుగు తీర్థ పనులు చేపట్టకపోవడం వల్ల వర్షపు నీరు కాలువల్లో ప్రవహించక మెయిన్ రోడ్డు మీదకి వస్తుంది అన్నారు. దీనివల్ల రోడ్డు ముంపుకు గురై చెరువును తలపిస్తోందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి ఏమాత్రం వర్షం పడిన ముంపుకు గురవుతున్న పార్వతీపురం పట్టణ మెయిన్ రోడ్డు తో పాటు ఆయా ముంపు ప్రాంతాలలో ముంపుకు గురి కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం తమ పార్టీ ఇన్చార్జ్ బత్తిన మోహన్ రావు ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగిందన్నారు.
